Minister Srinivas Goud PA’s son committed suicide: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కొడుకు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పనిచేస్తున్న దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - November 21, 2022 / 06:18 PM IST

Hyderabad News: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పనిచేస్తున్న దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపూర్ సెంటర్ పార్క్ కాలనీలోని శ్రీ వెంకట సాయి నిలయంలో అక్షయ్ కుమార్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మహబూబ్‌ నగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అక్రమ వసూళ్ల కేసులో ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లిన అక్షయ్.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.

అక్షయ్ గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోనే ఓ ఏమ్మార్వో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసినట్టుగా తెలుస్తోంది. అయితే డబుల్ బెడ్ రూమ్ అక్రమ వసూళ్లకు సంబంధించి అక్షయ్‌‌ను ఎవరైనా బెదిరింపులకు గురిచేశారా?.. లేక జైలుకు వెళ్లి వచ్చాననే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియరాలేదు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.