Prime9

UP Person Arrest: పాకిస్తాన్ తో గూఢచర్యం.. యూపీ వాసి అరెస్ట్!

UP Person Arrested due to Spying For Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే దాడి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పెద్ద సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టింది. అనంతరం భారత- పాక్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. చివరికి కాల్పుల విరమణ పేరుతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో దాడులు ఆగిపోయాయి.

 

మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే పాకిస్తాన్ సాయంతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న వారిని గుర్తించేందుకు ఇన్వెస్టిగేషన్ టీమ్ రంగంలోకి దిగింది. అనుమానం వచ్చిన పలువురిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలో పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న ఆరుగురిని భద్రతా బలగాలు అరెస్టు చేశారు. వీరిలో ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమెను విచారిస్తుండగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

 

మరోవైపు ఇదే తరహాలో పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న యూపీ వాసి పోలీసులకు చిక్కాడు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం పనిచేస్తున్న యూపీలోని రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గూఢచర్యంతో పాటు పాక్ కు స్మగ్లింగ్ చేస్తున్నాడనే సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. చివరికి మొరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. పాక్ నిఘా సంస్థ కోసం అతడు గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని కూడా ఐఎస్ఐకి చేరవేసినట్టు అధికారులు గుర్తించారు. సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించేందుకు పలుమార్లు అక్కడికి వెళ్లినట్టు అధికారులు నిర్ధారించారు.

 

అలాగే వ్యాపారం పేరుతో కాస్మోటిక్స్, బట్టలు, సుగంధ ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేశాడని వెల్లడించారు. ఓ వైపు స్మగ్లింగ్, మరోవైపు గూఢచర్యం చేశాడని తెలిపారు. అలాగే ఐఎస్ఐ ఏజెంట్లను ఆర్థికసాయంతో పాటు, సిమ్ కార్డులు కూడా సరఫరా చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ కోసం రిక్రూట్మెంట్ కూడా నిర్వహించాడని, ఇందులో భాగంగా యూపీకి చెందిన పలువురిని పాకిస్తాన్ కు పంపినట్టు తెలిపారు. వీరికి ఐఎస్ఐ ఏజెంట్లు వీసాలు ఏర్పాటు చేసిన్టటు గుర్తించారు.

 

Exit mobile version
Skip to toolbar