Prime9

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా పోస్ట్.. అసోసియేట్ ప్రొఫెసర్ కు బెయిల్

Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు కలిగేలా పోస్టులు పెట్టినందుకుగాను హర్యానాలోని అశోక యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ ను ఆదివారం ఢిల్లీలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.

 

దీనిపై అలీఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఇకపై ఆన్ లైన్ లో ఉద్రిక్తతలు కలిగేలా పోస్టులు కానీ, కంటెంట్ కానీ పెట్టొద్దని, అలాగే ఎలాంటి ప్రసంగాలు చేయొద్దని ఆదేశించింది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉన్నప్పటికీ ప్రొఫెసర్ ప్రకటనలు మాత్రం ఉద్రిక్తతలు కలిగించేలా ఉన్నాయని తెలిపింది. ఆయన ఉపయోగించిన పదాలు ఇతరులను అవమానించేలా, ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే అలీఖాన్ కేసు విచారించేందుకు ముగ్గురు ఐజీ స్థాయి అధికారులతో సిట్ ను ఏర్పాటు చేయాలని హర్యానా డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

కాగా ఆపరేషన్ సిందూర్ దాడులపై మహిళా ఆర్మీ అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి ఆయన కామెంట్స్ చేశారు. అధికారులు దాడులను అతిగా చేసి చూపిస్తూ.. మీడియాలో ఆర్భాటం చేస్తున్నారని పోస్ట్ పెట్టారు. దీనిపై బీజేపీ యూత్ వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అలీఖాన్ కు నోటీసులు ఇచ్చింది.

Exit mobile version
Skip to toolbar