H3N2 Death: మహారాష్ట్రలో H3N2 వైరస్ తో వైద్యవిద్యార్ది మృతి

మహారాష్ట్రలో H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ సోకి 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సమాచారం మేరకు మృతుడు అహ్మద్‌నగర్‌లోని ఓ కళాశాలలో మెడిసిన్‌ చదువుతున్నాడు. గత వారం, అతను స్నేహితులతో కలిసి కొంకణ్‌లోని అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లాడు.

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 12:54 PM IST

H3N2 Death: మహారాష్ట్రలో H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ సోకి 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సమాచారం మేరకు మృతుడు అహ్మద్‌నగర్‌లోని ఓ కళాశాలలో మెడిసిన్‌ చదువుతున్నాడు. గత వారం, అతను స్నేహితులతో కలిసి కొంకణ్‌లోని అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తరువాత వైద్య పరీక్షల్లో అతనికి కోవిడ్-19 మరియు H3N2 రెండింటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీనితో అతను అహ్మద్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు, అక్కడ అతను సోమవారం రాత్రి (మార్చి 13) రాత్రి 10 గంటలకు మరణించాడు.

దేశంలో  9 కు చేరిన మరణాల సంఖ్య..(H3N2 Death)

మరోవైపు నాగ్‌పూర్‌లో H3N2 కారణంగా మరొక మరణం కూడా నమోదయింది. 78 ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ రెండు కేసులతో H3N2 వైరస్ తో భారతదేశంలో మరణాల సంఖ్య 9 కు చేరింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 352 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్‌ తెలిపారు. వారి చికిత్స కొనసాగుతోంది. ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. H3N2 ప్రాణాంతకం కాదు. వైద్య చికిత్స ద్వారా నయం చేయవచ్చు. భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.మంగళవారం తెల్లవారుజామున, గుజరాత్‌లోని వడోదర నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్లూ వంటి లక్షణాల కారణంగా 58 ఏళ్ల మహిళ మరణించినట్లు ఒక అధికారి తెలిపారు. రోగిని మార్చి 11న ఒక ప్రైవేట్ సౌకర్యం నుండి సర్ సాయాజీరావు జనరల్ (SSG) ఆసుపత్రికి తరలించారు. ఆమె మార్చి 13న మరణించినట్లు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.

ఇటీవల దేశవ్యాప్తంగా ఆస్పత్రిలో చేరుతున్న వారిలో దాదాపు సగం మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వాళ్లే.వీరితో పాటు బయటి రోగుల్లో అత్యధికులకు హెచ్‌3ఎన్‌2 రకం వైరస్‌ కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.హెచ్‌3ఎన్‌2 ఉపరకాలు సాధారణ ఇన్‌ఫ్లూయెంజా వేరియంట్స్ కంటే బలంగా ఉన్నాయని తెలిపింది.ఈ వైరస్ సోకిన 92 శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పుల లక్షణాలు కనిపించగా.. 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు ఉన్నాయి.ఈ వైరస్‌ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు బాధిస్తోంది.