Jaishankar Comments on Ceasefire: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపైన మాత్రమే చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ తో కాల్పుల విరమణకు మాత్రమే ఒప్పుకున్నామని.. ఉగ్రవాదంపై పోరులో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఉగ్రవాదం భారత్ ఎప్పటికీ రాజీ లేని పోరాటం చేస్తుందని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని అంతం చేస్తుందని పేర్కొన్నారు.
అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైనిక దాడులు చేసింది. ఇందులో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. భారత రక్షణ వ్యవస్థ వాటిని ఎక్కడికక్కడ నాశనం చేసింది. అలాగే పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు కాల్ చేశారు. అమెరికా జరిపిన సుదీర్ఘ చర్చలతో కాల్పుల విరమణపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సంచలన ప్రకటన చేశారు.
కాగా పాకిస్తాన్ తో కేవలం కాల్పుల విరమణపైనే భారత్ ఒప్పందం కుదుర్చుకుందని.. కానీ ఉగ్రవాదంపై తమ వైఖరి మారదని జైశంకర్ స్పష్టం చేశారు. ఈనెల 12న భారత్- పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలు ఉంటాయని.. వాటి తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు తగిన నిర్ణయం తీసుకుంటాయని అన్నారు.