Dhanyawaad Yatra: యూపీలో కాంగ్రెస్‌ పార్టీ ధన్యవాద్‌ యాత్ర

ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ పార్టీ పరువు నిలుపుకుంది. అయితే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, ఎస్‌పీ పొత్తు మ్యాజిక్‌ బాగా పనిచేసింది. మొత్తం 80 స్థానాలకు గాను ఇండియా కూటమికి 43 సీట్లు సాధించింది

  • Written By:
  • Publish Date - June 8, 2024 / 01:44 PM IST

Dhanyawaad Yatra:ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ పార్టీ పరువు నిలుపుకుంది. అయితే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, ఎస్‌పీ పొత్తు మ్యాజిక్‌ బాగా పనిచేసింది. మొత్తం 80 స్థానాలకు గాను ఇండియా కూటమికి 43 సీట్లు సాధించింది. బీజేపీని 33 సీట్లకు పరిమితం చేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 11 నుంచి 15 వరకు ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ధన్యవాద్‌ యాత్ర నిర్వహిస్తోంది. ఈ ధన్యవాద్‌ యాత్రలో పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

43 ఎంపీ సీట్లను గెలుచుకున్న ఇండియా కూటమి..(Dhanyawaad Yatra)

యూపీలో మొత్తం 80 లోకసభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకోగా.. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 37 సీట్లు గెలుచుకుంది. ఇక బీజేపీ మాత్రం 33 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఇటు ఎస్‌పీ, అటు కాంగ్రెస్‌ కూడా మెరుగైన సీట్లు సాధించుకుంది. 2019లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసీటు.. ఎస్‌పీ ఐదు సీట్లు గెలిచింది. బీజేపీ మొత్తం 62 సీట్లు కైవసం చేసుకుంది. ఇక రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీలో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ను సుమారు మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. కాగా ఈ సీటుకు రాహుల్‌ తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే రాహుల్‌ తన తల్లి మెజారిటీ రికార్డును బద్దలు కొట్టారు. 2019లో ఆమె ఇదే దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌పై 1,67,178 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అమెధీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ.. 2019లో రాహుల్‌ను ఓడించారు. ఈ సారి ఆమె కాంగ్రెస్‌కు చెందిన కిశోరీలాల్‌ శర్మ చేతిలో 1.65 లక్షల మార్జిన్‌తో ఓడిపోయారు.

ఇక ఉత్తరప్రదేశ్‌లో ఇతర పార్టీల విషయానికి వస్తే జయంత్‌ చౌదరికి చెందిన రాష్ర్టీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), అప్నాదళ్‌ (సోనేలాల్‌), ఈరెండు పార్టీలు బీజేపీ- ఎన్‌డీఏ కూటమిలో భాగస్వాములు .. వరుసగా రెండు, ఒక సీటు దక్కించుకున్నాయి. ది అజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం)కు చెందిన పార్టీ ఒక సీటు గెలుచుకుంది. ఇక ఉత్తరప్రదేశ్‌ విషయానికి దేశంలోనే అతి పెద్ద రాష్ర్టం మొత్తం 80 లోకసభ స్థానాలు, 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాహుల్‌ , సోనియాలు ఇప్పటి నుంచే శాసనసభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టి ఓటర్లకు దగ్గరయ్యేందుకు ధన్యవాద యాత్రను చేపడుతున్నారని చర్చ పార్టీ వర్గాలు వినిపిస్తోంది.