ACB issued summons to Aam Aadmi Party Leaders: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోని క్లాస్ రూమ్ ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న జైన్, జూన్ 9న సిసోడియా హాజరుకావాలని ఏసీబీ తన సమన్లలో పేర్కొంది. ఏప్రిల్ 30న ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమన్లు ఇచ్చారు. తరగతి గదుల నిర్మాణంలో సుమారు రూ. 2 వేల కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 12 వేల క్లాస్ రూమ్ ల నిర్మాణల్లో భాగంగా ఈ కుంభకోణం జరిగినట్టు సమాచారం.
కాగా ఆప్ ప్రభుత్వ హయాంలో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ మంత్రులుగా పనిచేశారు. అయితే తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. ఆ ప్రాజెక్టులో అనేక లోపాలు ఉన్నట్టు సీవీసీ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ తెలిపారు. మూడేళ్ల నుంచి ఆ రిపోర్టుపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఏసీబీ సంయుక్త కార్యదర్శి మదుర్ వర్మ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రిపోర్టును సేకరించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వర్మ వెల్లడించారు. కాగా తరగతి గదుల నిర్మాణంలో గోల్ మాల్ జరిగిందని బీజేపీ నేతలు కపిల్ మిశ్ర, హరీశ్ ఖురానా, నీలకంఠ బక్షి 2019లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని మూడు జోన్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.