277 Electric Buses to Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. అందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 277 ఎలక్ట్రిక్ బస్సలు రోడ్డుపైకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా గ్రేటర్ పరిధిలో మొత్తం 2800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అయితే కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ- డ్రైవ్ పథకం కింద 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. రెండున్నరేళ్లలో విడతల వారీగా వీటిని అందజేస్తారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల రాకతో డిమాండ్ కొంత తీరుతుందని భావిస్తున్నారు. కాగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరగుతుండడంతో అందుకు తగినట్లుగా అన్ని డిపోల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గ్రేటర్ లో ప్రస్తుతం 25 బస్ డిపోలు ఉన్నాయి. ఇప్పటి వరకు కంటోన్మెంట్, మియాపూర్, హెసీయూ, హయత్ నగర్- 2, బీహెచ్ఈఎల్ డిపోల్లో మాత్రమే చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. దీంతో రాబోయే అవసరాలకు ఇవి సరిపోవు. కనుక అన్ని డిపోల్లో 25 నుంచి 30 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.