Huzurabad: అక్రమ అబార్షన్లపై సీరియస్ .. హుజురాబాద్లోని మాధవి నర్సింగ్ హోం సీజ్

అక్రమ అబార్షన్లు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు.

  • Written By:
  • Publish Date - July 13, 2024 / 03:09 PM IST

 Huzurabad: అక్రమ అబార్షన్లు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణలో సంచలనం రేపుతున్న భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటాహుటిన జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, ఎంసిహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా జువేరియా, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ చందు..పోలీసుల సహాయంతో పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. స్కానింగ్ రూం, ల్యాబ్, బెడ్స్ ఇతర గదులను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం లేవని గుర్తించారు. ఆస్పత్రి ముందు ప్రదర్శించిన డాక్టర్ల పేర్లు, ఆసుపత్రికి వచ్చే డాక్టర్ల పేర్లకు సరిపోవడంలేదని తేలింది.

 ఆస్పత్రి నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆగ్రహం..( Huzurabad)

రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన డాక్టర్లకు బదులుగా వేరే వారు వస్తున్నారని తేలింది. వాష్ రూంలు, రోగులు ఉండే గదులు, ఇతర గదులు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కాకుండా, రికార్డులు కూడా పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిఎంహెచ్ వో డాక్టర్ సుజాత స్పందిస్తూ డీఆర్ఏచట్టం ప్రకారం ఆసుపత్రులు నిర్వహించుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చినా వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమ అబార్షన్ల రాకెట్లో ముగ్గురు అరెస్టై రిమాండ్కు వెళ్లారని, ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్యురాలు ఎవరనేది విచారణ చేస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం సదరు డాక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.