ఖమ్మం: తెలంగాణ ఎస్ఐ ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన ఖమ్మం తల్లీకూతుళ్లు

గురువును మించిన శిష్యులు.. తండ్రిని మించిన తనయుడు.. తల్లిని మించిన కూతురు.. ఇవీ సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం.. ఎస్ఐ ప్రిలిమనరి పరీక్షల్లో పాసై, ఈవెంట్సో లో ఒకేరోజు తల్లీకూతుర్లు అర్హత సాధించిన ఆ తల్లీకూతుళ్ళ సక్సెస్ కథ.

Khammam: గురువును మించిన శిష్యులు.. తండ్రిని మించిన తనయుడు.. తల్లిని మించిన కూతురు.. ఇవీ సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం.. కానీ వాటన్నింటికి భిన్నంగా తల్లి ఆత్మవిశ్వాసంతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నాలుగో ఉద్యోగం సాధించేందుకు పట్టువదలని విక్రమార్కురాలి లాగా ప్రయత్నిస్తుంటే ఆమేను ఆదర్శంగా తీసుకున్న ఆమే కూతురు.. ఇద్దరు ఎస్ఐ ప్రిలిమనరి పరీక్షల్లో పాసై, ఈవెంట్స్ లో ఒకేరోజు తల్లి కూతుర్లు అర్హత సాధించటంతో ఆ తల్లి కూతుళ్ళ సక్సెస్ కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఆ తల్లి కూతుళ్ళు సాధించినది ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

అటు స్పోర్ట్స్.. ఇటు కర్తవ్యం.. మరోవైపు సంసార బాధ్యతలు

ఆమె బాల్యం అంతా గ్రామీణ ప్రాంతంలోనే సాగిపోయింది. ఆమే విద్యాబ్యాసం కూడా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే జరిగిపోయింది. చదుకునే సమయంలో ఆమె ఆటల్లో స్టేట్ లెవల్లో ఎన్నో బహుమతులు సైతం పొందింది..పెళ్ళీడు వచ్చిందని పెళ్ళి చేశారు తల్లిదండ్రులు భర్తతో కాపురం చేసుకుంటూనే తొలుత అంగన్ వాడి కార్యకర్త పోస్టు కొట్టింది. ఆతర్వాత కొన్నాళ్ళకి పోలీస్ శాఖలో హోంగార్డు పోస్టులు పడితే స్పోట్స్ కోటలో ఉద్యోగం వచ్చింది. అంతటితో ఆగలేదు.. మళ్ళీ కానిస్టేబుల్ పోస్టు కొట్టంది. విధి నిర్వహణలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మధ్య మధ్యలో తాను ప్రావీణ్యం పొందిన హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతి ఏడాది పాల్గొంటూ పతకాలు సాధిస్తుంది. మరోపక్క కుటుంబ బాధ్యతలు మోస్తూనే తన కన్న కూతురుని ఉన్నత చదువులు చదివించింది. ఈమధ్య పోలీస్ శాఖ రిలీజ్ చేసిన ఎస్ఐ పోస్టులకు తల్లీకూతురు ఇద్దరు పోటీపడి చదివి ప్రిలిమనరి పరీక్షలో అర్హత పొందారు. ఇక మొన్న 14వ తేదీన ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈవెంట్స్ లో తల్లి కూతుళ్ళు ఒకే బ్యాచ్ లో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. దీనితో జిల్లాలో ఎక్కడ నలుగురు గుమికూడిన అక్కడ ఆ తల్లి కూతుళ్ళ చర్చే నడుస్తోందిని చెప్పవచ్చు.

ఫిజికల్ టెస్టుల్లో సత్తా చాటారు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని అనే తల్లి కూతుళ్లు ఉన్నారు. వీరు ఎస్ఐ ప్రిలిమనరి పరీక్షలో పాసై పోలీస్ ఉద్యోగ ఎంపికలో కీలకమైన పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ ఫుట్ విభాగాలలో పోటీ పడి ఇద్దరూ అర్హత సాధించారు. వీరు ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం రామన్న పేట గ్రామంలో నివాసం ఉంటున్నారు.

బాల్యం నుంచే ప్రభుత్వ కొలువుపై కన్ను

ఓ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నాగమణి విద్యార్థి దశనుంచే ఇటు చదువులోనూ, అటు క్రీడల్లోనూ రాణించేది. పాఠశాల, కళాశాల క్రీడల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు ఎన్నో అందుకుంది. ఆర్ధిక పరిస్థితులు, పైగా ఆడపిల్ల కావడంతో తండ్రి తనకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపించారు. అయినా నాగమణిలో మాత్రం ఏదో సాధించాలన్న తపన, ఆ కసితోనే తొలుత అంగన్వాడీ ఉద్యోగం సాధించింది. పోలీసు కావాలనే తన చిన్నప్పటి కోరిక మేరకు హోంగార్డు ఉద్యోగం స్పోట్స్ కోటలో సాధించింది. ఆతర్వాత సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇలా అంచెలంచెలుగా తన పట్టుదలతో ఎదిగింది. అయినా సంతృప్తి చెందని కానిస్టేబుల్ నాగమణి ఇటీవల తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఎస్సై, కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ వెలువడింది.

శభాష్ అనిపించుకుంటున్న తల్లీకూతుర్లు..

దీనికి తల్లి నాగమణి, కూతురు త్రిలోకిని ఇద్దరు దరఖాస్తు చేశారు..ప్రిలిమ్స్ లో నెగ్గి,తనకున్న అవగాహనతో గ్రౌండ్ కు కూతురును తీసికెళ్లి, తనతో పాటు కూతురికి కూడా మెళకువలు నేర్పింది. అదృష్టం కొద్దీ తల్లికూతుళ్ళు ఇద్దరికి ఒకే రోజు ఈవెంట్స్ కావడం, మళ్లీ ఒకే బ్యాచ్ రావడంతో తల్లి కూతుళ్లు నువ్వా నేనా అంటూ పోటీ పడీ మరీ ఇద్దరు అర్హత సాధించారు. ఇది చూసిన అక్కడి పోలీసు అధికారులు, మిగతా అభ్యర్థులు కూతురిని మించిన తల్లి అని వారిద్దరిని అభినందించారు. వెంటనే ఓ ఫోటో కొట్టి, పోలీసు ఉద్యోగానికి తళ్లీకూతుళ్ళు అనే టైటిల్ పెట్టి, సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ పోస్ట్ కాస్త ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం నాగమణి ములుగు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న ఈ తల్లీకూతుర్లు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. ఇక ఫైనల్ పరీక్షలో కూడా నెగ్గి ఎస్ఐలుగా ఉద్యోగాలు సాధించాలని ఆశిద్దాం.

ఇదీ చదవండి: ‘తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ నిర్వీర్యం అవుతోంది’ అని చంద్రబాబు ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అన్నారు?