Heavy Rains in Telugu States: నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలకు నైరుతి రుతుపవనాల రాకతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా జూన్ 1 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పది రోజుల ముందుగానే కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల వ్యాప్తికి అనుకూల వాతావరణం ఉండటంతో నిన్ననే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడున్నాయని తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.
మరోవైపు నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే 40- 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఇక దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, కర్నాటక రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు, అరేబియా సమద్రంలోని అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాబోయే ఐదు రోజుల్లో ముంబై, కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.