Janasena chief Pawan Kalyan: మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తాను కమిట్‎మెంట్‎తో పార్టీ స్టార్ట్ చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తానని పవన్ అన్నారు. కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 08:13 PM IST

Janasena chief Pawan Kalyan: తాను కమిట్‎మెంట్‎తో పార్టీ స్టార్ట్ చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తానని పవన్ అన్నారు. కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. మత్స్యకారుల బోటులో ప్రయాణించారు. సముద్రంలో బోటులో వెళ్తూ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార స్థితిగతులను పవన్ పరిశీలించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చమురు సంస్థల కార్యకలాపాలతో మత్స్య సంపద తగ్గిపోతుందని మత్స్యకారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వేట విరామ సమయంలో రావాల్సిన నష్టపరిహారం రావట్లేదని పవన్‌కు తెలిపారు.

మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతు..(Janasena chief Pawan Kalyan)

ఏటిమొగలో మత్స్యకారులతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. నేను నిబద్ధతతో రాజకీయ పార్టీని స్థాపించాను.రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజా సమస్యల కోసం నిలబడే పార్టీ జనసేన.సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. వృత్తిఆధారిత సమాజం మనది.తీర ప్రాంతాల్లో అధికంగా నివసించేది మత్స్యకారులే. ఏదైన హాని జరిగితే మత్స్యకారులంతా నలిగిపోతారని అన్నారు. మత్స్యసంపద కూడా వ్యవసాయంతో సమానమని, జనసేన అధికారంలోకి వస్తే మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సముద్ర జలాలు కలుషితం కాకుండా కఠినమైన పర్యావరణ చట్టాలు తీసుకొస్తామని తెలిపారు. మత్స్యకారుల పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. 2024లో ఒక్కసారి జనసేనను నమ్మండని కోరారు.

నాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే ..

అధికారమే అంతిమలక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడక్కర్లేదని తనకున్న కెపాసిటీకి ఏదో పదవి పొందొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు.బటన్ నొక్కితే డబ్బులు పడతాయని చెప్పనని అన్నారు. జనసేన పార్టీకి ఎంపీలు లేరు. నాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే మోదీ నాతో మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. సరైన వ్యక్తిని మీరు నమ్మడం లేదని వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థిస్తున్నానని అన్నారు. మీరు నాకు ఎంపీలు ఇవ్వండి.. నేను పని చేయిస్తాను అంటూ పవన్ వారికి హామీ ఇచ్చారు. ఏటిమొగను స్మార్ట్‌సిటీగా మారుస్తామని కూడా పవన్ కల్యాణ్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.