Ninhydrin Test: వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి

వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 05:12 PM IST

Ninhydrin Test:  వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్‌ను సిబిఐ అధికారులు కోరారు. అయితే లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ నిపుణులు చెప్పారు. ఈ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ హెచ్చరించింది.

ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్..(Ninhydrin Test)

లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరారు. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్ అనుమతించాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ పిటిషన్‌పై నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని కోర్టుకి సీబీఐ అధికారులు చెప్పారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు, నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతినిచ్చింది.

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి..

మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. వైఎస్ సునితా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని లోపాలున్నాయని పిటీషన్‌లో తెలిపారు. ఎంపీ అవినాశ్ రెడ్డిపై ఉన్న అబియోగాలు హైకోర్టు పరిగణంలోకి తీసుకోలేదని.. దేశంలో సీబీఐ విచారిస్తోన్న ఏ కేసులోనూ ఇంత వరకూ ముందస్తు బెయిల్ ఇవ్వలేదని పిటీషన్లో గుర్తు చేశారు.