Kadapa: కడప వేదికగా మూడు రోజులుగా టీడీపీ మహానాడు జరుగుతోంది. కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా సమావేశాల్లో నేడు మూడోరోజు సమావేశాలు జరుగుతున్నాయి. నేడు చివరిరోజు కావడంతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం అందరి దృష్టి మూడోరోజు బహిరంగ సభపైనే ఉంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. కాగా సభలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ చేసిన పాలన, భవిష్యత్తు లక్ష్యాలపై పార్టీ అధినేత చంద్రబాబు, సీనియర్ నేతలు వెల్లడించనున్నారు. కాగా నేడు జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకు సంబంధించి భారీగా ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా కావడంతో మరింతగా జనసమీకరణ చేసి ప్రతిపక్షానికి సవాల్ చేయాలని నేతలు భావిస్తున్నారు. నేటి బహిరంగ సభకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని 3 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి కడపకు వచ్చే వివిధ మార్గాల్లో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
మరోవైపు రెండో రోజు మహానాడులో పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాజకీయ నేతగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఇక రెండోరోజు మహానాడులో మధ్యాహ్నం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబును ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.