TDP and YCP Leaders Clashes at Tiruvuru in NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది. నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వివాదం చెలరేగింది. దీంతో టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే వైసీపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు.
కాగా నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తిరువూరు ఇవాళ ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే ఎన్నిక సమయానికి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల నేతల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ హాల్ లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా.. మరో ఐదుగురు సభ్యులు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంటుందనే ఉద్దేశంతో వైసీపీ సభ్యులు వివాదానికి తెరలేపారు. మరోవైపు ఛైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే, కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ లోకి వెళ్లారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మాజీ మంత్రి జోగి రమేష్ ను హౌస్ అరెస్ట్ చేశారు.