AP Weather Update : ఏపీ ప్రజలకు హై అలర్ట్.. ఆ మండలాల్లో రానున్న రెండు రోజుల్లో భానుడి భగభగలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చెమటలకు తడిసిపోతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకొని సేదదీరుతున్నారు. ఇక బయట ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధ వేస్తుంది.

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 09:17 AM IST

AP Weather Update : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చెమటలకు తడిసిపోతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకొని సేదదీరుతున్నారు. ఇక బయట ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధ వేస్తుంది. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ పొట్ట కూటి కోసం కష్టపడే వారి జీవితాలు ముందుకు సాగక తప్పదు. అయితే మాత్రం ఈ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన పని. కాగా తాజాగా వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ), విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనాల ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గురువారం నాడు 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా  ట్వీట్ చేశారు.

వడగాడ్పులు ఎక్కువగా వీచే మండలాలు వివరాలు (AP Weather Update)..

శ్రీకాకుళం – 13, విశాఖపట్నం – 2, అల్లూరి జిల్లా – 7, అనకాపల్లి – 15, ఏలూరు –  2, తూర్పు గోదావరి – 4, కాకినాడ –  10, గుంటూరు – 11, ఎన్టీఆర్ – 12, కృష్ణా – 4, మన్యం – 11, పల్నాడు – 5, విజయనగరం – 23, వైఎస్సార్ జిల్లా –  6

 

ఈ మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు . ఐఎండీ అంచనా ప్రకారం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం (22-04-2023) ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

ఆదివారం ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు.

ఇక, బుధవారం నాడు అనకాపల్లి జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలోని ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.