Ambati Anjaneyulu: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు కన్నుమూత

Ambati Anjaneyulu: అలుపెరుగుని వీరులు, నిరంతరం ప్రజాసేవ పరామర్థంగా వృత్తిని చేపట్టే వారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

Ambati Anjaneyulu: అలుపెరుగుని వీరులు, నిరంతరం ప్రజాసేవ పరామర్థంగా వృత్తిని చేపట్టే వారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి విజయవాడలో తుదిశ్వాస విడిచారు. కాగా, నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుత్రిలో చేరిన ఆయన.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. అంబటికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విజయవాడ ప్రెస్‌క్లబ్‌, అమరావతి ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు కూడా అంబటి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

విజయవాడ బావాజీపేటలోని ఆయన నివాసం నుంచి సోమవారం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబటి ఆంజనేయులు ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజేయూ) స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ సలహాదారుడిగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు జర్నలిస్టు నాయకులు అన్నారు.