Chandrababu Mass warning to Covert on Mahanadu Stage: కడపలో మహానాడు కార్యక్రమం రెండోరోజు జరుగుతోంది. నేడు మహానేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ముందుగా ఆయనకు నివాళులు అర్పించారు. రాజకీయాలు, సినిమా రంగంలో రాణించిన గొప్ప వ్యక్తి అన్నారు. పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను మోసం చేశారని అన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేస్తే తాను కూడా నమ్మానని తెలిపారు. సాయంత్రానికి అసలు విషయం బయటకు వచ్చిందన్నారు. వివేకాను గొడ్డలితో నరికి చంపారని, రెండో రోజు పత్రికలతో తమపై ఆరోపణలు చేస్తూ కథనాలు రాశారని మండిపడ్డారు. అటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో జరిగిన పలువురు పార్టీ నేతల హత్యలతో తనకు అనుమానం వచ్చిందని, అందుకే ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదని చెప్పారు. కొంతమంది మన దగ్గర ఉండి మరో పార్టీకి కోవర్టులుగా పనిచేస్తూ వాళ్ల అండతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మన వేలితో.. మన కంట్లోనే పొడుచుకునేలా చేస్తున్నారని.. టీడీపీ వాళ్లు తమ వాళ్లను చంపుతున్నారని చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపించారు. మన కార్యకర్తలు ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. నేరస్తులు ఖబడ్దార్.. తన వద్ద వారి ఆటలు సాగవంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతలంతా కోవర్టులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన కార్యకర్త ఎప్పటికీ పార్టీతో శాశ్వతంగా ఉంటారని చెప్పారు.