AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్

ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటన్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాళ్టితో ముగియనుంది.. సాయంత్రంతో ఆయన రిటైర్డ్‌ కాబోతున్నారు.

  • Written By:
  • Publish Date - May 31, 2024 / 01:22 PM IST

AB Venkateswara Rao:ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటన్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాళ్టితో ముగియనుంది.. సాయంత్రంతో ఆయన రిటైర్డ్‌ కాబోతున్నారు.

ఏబీ విషయంలో అసలు ఏమి జరిగింది ?( AB Venkateswara Rao)

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఎత్తివేసింది. దీంతో ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఏబీ వెంకటేశ్వరరావు ఇవాళే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా… రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా సస్పెన్షన్లు విధించింది. ఈ నేపథ్యంలో ఏబీవీ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించగా.. ఆ సస్పెన్షన్‌ ను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ ను కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఈ సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమయంలో… సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌ లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. సస్పెన్షన్‌ ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. దీంతో… అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో… ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ సమయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే… ఆ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. దీంతో… హైకోర్టు ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ అందజేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.