Vasireddy Padma: జగన్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టారు: వాసిరెడ్డి పద్మ

  • Written By:
  • Updated On - October 24, 2024 / 11:17 AM IST

Vasireddy Padma Quits YSRCP: మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పార్టీని విడటానికి కారణమేంటో వెల్లడించారు. మంగళగిరి మండలం కాజ గ్రామ సమీపంలో తన నివాసంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ… ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కారణమన్నారు వాసిరెడ్డి పద్మ. వైఎస్సార్‌సీపీలో జగనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ కార్యకాలపాల్లో కూడా జగన్‌ అన్ని తానై వ్యవహరిస్తారని,  కనీసం ఓటమిపై కూడా ఆయన ఎలాంటి సమీక్షా చేయలేదన్నారు. ఓటమి తర్వాత పార్టీ నేతలను ఎవరినీ పట్టించకోవడం లేదని అసహనం వ్యక్తం చేవారు.

అందువల్లే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. తానే రాజు, తానే మంత్రి అన్న చందంగా జగన్‌ వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరోసారి మోసం చేయడానికి జగన్‌ గుడ్‌బుక్‌ అని చెబుతున్నారని, ఐదేళ్లు పార్టీని నమ్ముకొని అన్నీ కోల్పోయిన వారికి ఆయన కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. పైగా గుడ్‌బుక్‌లో ప్రమోషన్లు ఇస్తామననడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది రాజకీయ పార్టీనా? లేదా ప్రైవేటు కంపెనీనా? వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో చూసి ప్రజలు భారీ మెజారిటీనితో గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే సంక్షేమం పేరుతో జగన్‌ ప్రజలను లూటీ చేశారన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని విమర్శించారు. మద్యం పేరుతో భారీ దోపిడీకి తెర తీశారని విమర్శించారు.