Pakistan Power Outage: పాకిస్తాన్‌లో గంటల కొద్దీ విద్యుత్‌ కోతలు.. నిరసనలకు దిగుతున్న ప్రజలు

పాకిస్తాన్‌లో గంటల కొద్దీ విద్యుత్‌ కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. విద్యుత్‌ కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మంగళవారం విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 05:30 PM IST

Pakistan Power Outage: పాకిస్తాన్‌లో గంటల కొద్దీ విద్యుత్‌ కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. విద్యుత్‌ కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మంగళవారం విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యుత్‌ అధికారులు ప్రధాని మందు పూర్తి సమచారం ఉంచారు. దేశవ్యాప్తంగా లోడ్‌ షెడ్డింగ్‌ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు రోడెక్కి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. మంగళవారం నాటి సమావేశంలో విద్యుత్‌ కోతలపై ప్రధానమంత్రి ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

ఒక వైపు మండుతున్న ఎండలు..మరో వైపు విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే పాకిస్తాన్‌ ఆర్థిక రాజధాని కరాచీలో తరచూ విద్యుత్‌ కోతలతో ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.అయితే కరాచీతో పాటు పొరుగున ఉన్న కొన్ని ఏరియాల్లో నెలవారి విద్యుత్‌ బిల్లులు చెల్లించని కారణంగా విద్యుత్‌ నిలిపి వేస్తున్నారు. పెద్ద ఎత్తున విద్యుత్‌ కోతలు విధించడంతో కరాచీలోన మంగోపిర్‌ఏరియాకు చెందిన వారు విద్యుత్‌ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. నిరసన కారులు ఎలక్ర్టిక్‌ గ్రిడ్‌ స్టేషన్‌ వద్ద క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలోచుట్టు పక్కల నివాసం ఉండే వారు కూడా వీరికి జత చేరారు.

వందలకోట్ల బకాయిలు..(Pakistan Power Outage)

దీంతో దిగివచ్చిన అధికారులు నిరసన కారులతో పలుమార్లు సమావేశం అయ్యారు. అయినా దీనికి పరిష్కారం మాత్రం లభించలేదు. ఇదిలా ఉండగా గత వారం పాకిస్తాన్‌లో విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీ కె – ఎలక్ర్టిక్‌ సింధ్‌ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. తమకు చెల్లించాల్సిన వందలాది కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ కోత విధిస్తామని హెచ్చరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సింధ్‌ ప్రభుత్వంతో పాటు కరాచీ వాటర్‌ అండ్‌ సీవరేజ్‌బోర్డు (కెడబ్ల్యుఎస్‌బీ) ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదు.

వందలాది కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిల వల్ల కె- ఎలక్ర్టిక్‌ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో నెట్‌వర్క్‌ మెయిన్‌టెనెన్స్‌ కష్టంగా మారింది. కరాచీ వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు కె- ఎలక్ర్టిక్‌కు సుమారు రూ.500 కోట్లు బకాయిపడింది. అంతకు ముందు పాకిస్తాన్‌లో ఖైబర్‌ ఫక్తూన్‌ క్వా కు చెందిన నివాసితులు హజార్‌ ఖవాని గ్రిడ్‌ స్టేషన్‌లోకి చొచ్చుకుపోయారు. ఎండాకాలంలో దీర్ఘకాలం పాటు విద్యుత్‌ కోతకు నిరసనగా వీరుగ్రిడ్‌ స్టేషన్‌లోకి చొచ్చకువెళ్లాల్సి వచ్చింది. దీంతో భారీ ఎత్తున పోలీసులను రప్పించి వారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.