Canada: కెనడా పోలీసుల అదుపులో నిజ్జర్‌ హంతకులు!

కెనడాలో ఖలిస్తాన్‌ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యకు సంబంధించి ముగ్గురు యువకులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాది జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్‌ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి.

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 03:33 PM IST

Canada:కెనడాలో ఖలిస్తాన్‌ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యకు సంబంధించి ముగ్గురు యువకులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాది జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్‌ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి. ఈ హత్య ఇండియా చేయించిదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని ఎడ్మంటోన్‌ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇక నిందితుల విషయానికి వస్తే కరణ్‌ బ్రార్ (22), కమల్‌ప్రీత్‌సింగ్‌ (22), కరణ్‌ప్రీత్‌ (28)ని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటిగ్రేటెడ్‌ హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం శుక్రవారం నాడు వెల్లడించింది.

స్టూడెంట్స్‌ వీసా ద్వారా కెనడాలోకి..(Canada)

ఇక అధికారులు ఈ ముగ్గురు నిందితులతో పాటు వీరి వెనుక ఉన్న వారి గురించి కూపీ లాగుతున్నారు. ఈ హత్యతో ఇండియాకు సంబంధాలు ఉన్నాయని చూపించాలనుకుంటోంది కెనడా. కాగా ఈ హత్యకు సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారే కాకుండా .. ఈ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధాలున్నాయనే కోణంలో కెనడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని సర్రేలో జరిగిన మీడియాలో సమావేశంలో కమాండర్‌ ఆఫ్‌ ది ఫెడరల్‌ పోలిసింగ్‌ ప్రోగ్రాం ఇన్‌ ది పసిఫిక్‌ రీజియన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ డేవిడ్‌ టెబౌల్‌ చెప్పారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు సేకరించారనే విషయం గురించి మాత్రం ఆయన వివరించలేదు. హత్యకు గల కారణల గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. నిందితులను సోమవారం నాడు సర్రేకు తీసుకు వచ్చిన తర్వాత విచారణలో కొన్ని అంశాలు వెలుగు చూస్తాయన్నారు పోలీసు అధికారి. ప్రస్తుతానికి ఈ అంశం విచారణ దశలో ఉందన్నార్నారు. ఇక పోలీసుల అదుపులో ఉన్న నిందితుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ ముగ్గురు నిందితులు ఐదేళ్ల క్రితం స్టూడెంట్స్‌ వీసా ద్వారా కెనడాలో ప్రవేశించారు.

ఈ గ్యాంగ్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు. కాగా పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు వారు ప్రయాణించిన టయోటా కరోలా కారు ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. తాజా పరిణామలపై సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను స్పందించారు. అసలు నేరస్తులు న్యూఢిల్లీలో ఉన్నారని.. కెనడాలో ఉన్న వారి ప్రతినిధులతో నిజ్జర్‌ను హత్య చేయించారని భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నాడు పన్నూ.