PM Modi : ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ కుటుంబానికి కారు ప్రమాదం… ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

  • Written By:
  • Publish Date - December 27, 2022 / 05:46 PM IST

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మోదీ చిన్న తమ్ముడైన ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులు గాయపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో చోటు చేసుకున్నట్ల సమాచారం అందుతుంది. మైసూరు నుంచి చామరాజనగర, బందీపురాకు కారులో వెళుతుండగా.. కడకోల సమీపంలో మధ్యాహ్నం 1.30 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ (70), ఆయన కుమారుడు మెహుల్ ప్రహ్లాద్ మోదీ (40), కోడలు జిందాల్ మోదీ (35), మనవడు మెహత్ మెహుల్ మోదీ (6), డ్రైవర్ సత్యనారాయణ చాలక (46) ఉన్నట్టు సమాచారం అందుతుంది.

ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ జోషీ, ఆయన కుమారుడు, కోడలు గాయపడగా… చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న మైసూర్ ఎస్పీ సీమా లట్కర్ సహా పలువురు అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రహ్లాద్ మోదీకి ముఖంపై, మనవడు మెహత్‌కు కాలికి గాయమయ్యిందని అధికారులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిని మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రహ్లాద్ మోదీ ప్రస్తుతం ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ ఫెడరేషన్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.