Wrestlers Protest: రెజ్లర్ల నిరసన.. కపిల్ డెవిల్స్ ప్రకటనతో సంబంధం లేదు: రోజర్ బిన్నీ

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు.

Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు. ఈ నిరసనలపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వకపోతే తమ మెడెల్స్ ను గంగలో కలుపుతామని రెజ్లర్ల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కపిల్ దేవ్ నేతృత్వంలోని ప్లేయర్స్ ఓ ప్రకటనలో కోరారు.

 

క్రీడలను రాజకీయాలతో కలపొద్దు : రోజర్ బిన్నీ(Wrestlers Protest)

అయితే , 1983 ప్రపంచ కప్ జట్టు సభ్యుల ప్రకటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ దూరంగా ఉన్నారు. క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఆయన తెలిపారు. రెజ్లర్ల కు మద్దతుగా తాను ప్రకటన చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయని.. అయితే వాటిలో ఎంత మాత్రం నిజం లేదని రోజర్ బిన్నీ తేల్చారు. చాలా సున్నితమైన అంశం ప్రస్తుతం అధికారులు పర్యవేక్షణలో ఉందని, కాబట్టి రాజకీయాలతో క్రీడలను కలపరాదన్నారు.

‘రెజ్లర్ల నిరసనకు సంబంధించి నేను ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ, నేను స్పందించినట్టు కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఇదే విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన అధికారులు పనిచేస్తున్నారనే నమ్మకం నాకుంది. క్రీడలు, రాజకీయాలు వేరు వేరు.. వాటిని ముడిపెట్టి చూడ కూడదు.’ అని బిన్నీ ANIతో అన్నారు.

కపిల్ డెవిల్స్ ప్రకటనలో ఏముందంటే?

ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసి, తమకు న్యాయం చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. గడువు లోపల తమకు న్యాయం జరగక పోతే తమ పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. ఈ క్రమంలో 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు రెజర్లలకు మద్దతుగా నిలుస్తూ అదే సమయంలో విన్నపమూ చేసింది. ఎంతో కష్టపడి సాధించిన ఆ పతకాలు మీవి మాత్రమే కాదని, వాటి విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరింది.

‘ఛాంపియన్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు చాలా కలవరపరిచాయి. దేశం కోసం పతకాలను సాధించేందుకు వారు ఎంతో శ్రమించారు. అలాంటి వాటిని గంగలో కలిపేయాలనే వారి ఆలోచన ఆందోళన కరంగా ఉంది. ఆ పతకాలు వాటి గుర్తింపు మాత్రమే కాదు.. వాటిలో దేశ ప్రతిష్ట కూడా ఉంది. ఈ విషయంలో రెజ్లర్లు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. అదే విధంగా వారి సమస్యలకు కూడా త్వరితగతిన న్యాయం జరగాలని ఆశిస్తున్నాం. చట్టం తన పని చేస్తుందని నమ్ముతున్నాం’ అని కపిల్ నేతృత్వంలోని జట్టు ప్రకటన విడుదల చేసింది.