IPL Schedule 2025 set to be announced next week: క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే వార్త. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ డేట్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మెగా లీగ్ ఫుల్ షెడ్యూల్ను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మ్యాచ్ ప్రారంభం తేదీలతో పాటు ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన తేదీలను బీసీసీఐ ఖరారు చేసిందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తన రెండు మ్యాచ్లను విశాఖలో ఆడనున్నట్లు సమాచారం. కాగా, మార్చి 21న తొలి మ్యాచ్ జరగనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా గతంలోనే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఐపీఎల్ షెడ్యూల్ను వచ్చే వారం రోజుల్లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్లో కూడా 70కిపైగా మ్యాచ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 10 జట్లలో 74 మ్యాచ్లు ఆడే అవకాశం ఉండనుంది. అయితే ఈ మెగా టోర్నీ మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా.. ఫైనల్ మ్యాచ్ మే 25న జరిగే అవకాశం ఉంది. కాగా, ఫైనల్ మ్యాచ్ వేదిక కోసం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ను సిద్దం చేస్తున్నారు. అంతకుముందు ఏడాది 2024 ఐపీఎల్ టోర్నీని కేకేఆర్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఈడెన్ మైదానంల జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్లో ప్లే ఆప్స్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. గత ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి చెందింది. ఇందులో భాగంగానే ప్లే ఆప్స్ మ్యాచ్లే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించిన వివరాలు అధికారంగా వెలువడలేదు. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించనుంది.