Raebareli: రాయబరేలిలో రాహుల్ గాంధీ ప్రత్యర్ది దినేష్ ప్రతాప్ సింగ్ ఎవరో తెలుసా?

ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోకసభ స్థానం సస్పెన్స్‌ ముగిసింది. ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఒకప్పటి సోనియాగాంధీ క్యాంపెయిన్‌ మేనేజర్‌ రాహుల్‌గాంధీతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 01:43 PM IST

Raebareli: ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోకసభ స్థానం సస్పెన్స్‌ ముగిసింది. ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఒకప్పటి సోనియాగాంధీ క్యాంపెయిన్‌ మేనేజర్‌ రాహుల్‌గాంధీతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ 38 శాతం ఓట్లు సాధించారు. సోనియాగాంధీ 55 శాతం ఓట్లు దక్కించుకున్నారు. గతంలో గాంధీలకు వ్యతిరేకంగా పోటీ చేసి ఈ స్థాయిలో ఓట్లు దక్కించుకన్న వారు లేరనే చెప్పాలి. తిరిగి 2024 నాటికి వచ్చే సరికి బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాధ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ రాహుల్‌కు వ్యతిరేకంగా పోటీకి దిగారు.

నాలుగు పార్టీలు మారారు..(Raebareli)

ఇక రాయబరేలి సీటు విషయానికి వస్తే కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీ 1971 , 1980లో పోటీ చేశారు. అటు తర్వాత రాజీవ్‌ గాంధీ కజిన్‌ అరుణ్‌ నెహ్రూ, మాజీ ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ వదిన షీలా కౌట్‌ కూడా రాయబరేలీ నియోజకవర్గానికి 1984, అటు తర్వాత 1989లో కూడా ప్రాతినిధ్య వహించారు. ఇదిలా ఉండగా బీజేపీ … కాంగ్రెస్‌కు రాయబరేలిలో క్యాంపెయిన్‌ మేనేజర్‌ను గాలం వేసి తమ వైపు తిప్పుకుంది. ప్రస్తుతం గాంధీలకు వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టింది. ఇక థాకూర్‌ విషయానికి వస్తే ఆయన యూపీలో అగ్ర కులానాకి చెందిన వారు కాగా రాయబరేలిలో ఈ నెల 20న ఐదవ విడత పోలింగ్‌ జరుగనుంది. ఇక 56 ఏళ్ల దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు నాలుగు పార్టీలు మారారు. ముందుగా సమాజ్‌వాదిపార్టీకి నమ్మకస్తుడిగా పనిచేశారు. అటు తర్వాత బహుజన్‌ సమాజ్‌పార్టీ, అటు తర్వాత కాంగ్రెస్‌పార్టీకి నమ్మకస్తుడిగా ఉండి…. ఫైనల్‌ బీజేపీ పంచన చేరారు. ఇక దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ విషయానికి వస్తే ఆయన రాయబరేలీలోనే నివాసం ఉంటున్నారు. గత రెండు దశాబ్దాల నుంచి వారి కుటుంబానికి ఇక్కడ గట్టి పట్టుఉంది. ఆయన కుటుంబానికి చెందిన వారు పలువురు ఎంఎల్‌సీ, ఎమ్మెల్యేలుగా పంచాయతీ ప్రెసిడెంట్లుగా గెలిచి నియోజకవర్గంలో గట్టి పట్టుసాధించారు.

రాయబరేలిలో 2019లో సోనియాకు దినేష్‌ ప్రతాప్‌సింగ్‌ గట్టిపోటీ ఇచ్చారు. సుమారు 38 శాతం ఓట్లు సాధించారు. అందుకే ఆయనకు యోగి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు. ఇక 2024లో రాహుల్‌కు వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టడానికి ప్రధాన కారణం దినేష్‌ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అదే సమయంలో కాంగ్రెస్‌ ఓటు షేరు గణనీయంగా తగ్గిపోతుండటంతో ఇదే అదునుగా దినేష్‌ను నిలబెట్టి రాహుల్‌కు గట్టిపోటీ ఇవ్వాలనుకుంది. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం రాయబరేలిలో మొత్తం 17,64.460 ఓటర్లు ఉన్నారు. వారిలో 1.40 లక్షల క్షత్రియులు, 1.35 లక్షల బ్రాహ్మణులు, 6.70 లక్షల ఓబీసీ, 4 లక్షలు ఎస్‌సీ, 1.20 లక్షల ముస్లింలు, 7,000వైశ్యులున్నారు. ఇక రాహుల్‌ గాంధీ, కేవలం సింగ్‌తోనే కాదు బీఎస్‌పీకి చెందిన థాకూర్‌ ప్రసాద్‌ యాదవ్‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. రాయబరేలిలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది జూన్‌ 4న తేలిపోనుంది.