13 Died in Chhattisgarh Road Accident: చత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 9 మంది మహిళలు, 4 చిన్నారులు ఆరు నెలల చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్, బలోద బజార్ జాతీయ రహదారిపై ఖరోరా ప్రాంతానికి సమీపంలో ఫ్యాసెంజర్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఫ్యాసెంజర్ వాహనంలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొంతమంది మృతదేహాలు ముక్కలుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కేకలు వేయడంతో భయాందోళనకు గురిచేసింది.
గాయపడిన క్షతగాత్రులను రాయ్పుర్లో ఉన్న బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. వీరంతా చౌతియా ఛత్తి కార్యక్రమానికి వెళ్లి తిరిగి రాయ్ పుర్ ప్రాంతానికి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు రాయ్ పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు.