Rahul Gandhi Visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్శిటీకి అకస్మాత్తుగా వచ్చారు. గంటసేపు డీయూఎస్యూ కార్యాలయంలో విద్యార్థి సంఘం నేతలతో సమావేశం అయ్యారు. కాగా ఢిల్లీ యూనివర్శిటీలోకి రాహుల్ గాంధీ రావడంపై యూనివర్శిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటన వల్ల విద్యార్థుల పనులకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్శిటీకి రావడం ఇది రెండవసారి అని.. మళ్లీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని ప్రొక్టర్ కార్యాలయం తెలిపింది. ఇంకోసారి ఇలాగే చేస్తే సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చింరించింది.
కాగా రాహుల్ గాంధీ డీయూఎస్యూ ఆఫీస్ కు రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో విద్యార్థుల పనులకు అంతరాయం కలిగిందని యూనివర్శిటీ తెలిపింది. ఎన్ఎస్యూఐ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అయితే రాహుల్ గాంధీ రాకపై విద్యార్థి సంఘం నేత రోనక్ ఖత్రి తెలిపారు. ప్రైవేట్ అతిథికి ముందస్తు అనుమతి పొందాలని ఎలాంటి నియమాలు లేవని అన్నారు. డీయూఎస్యూ ఆఫీస్ లో కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని.. ఎవరినైనా ఆహ్వానించే పూర్తి హక్కు విద్యార్థి సంఘానికి ఉందన్నారు. అయితే గతంలో బీహార్ లోనూ రాహుల్ గాంధీ ఇలానే వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక పోలీసులు అడ్డుకున్నారు.