Rahul Gandhi visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీలో మాట్లాడారు. యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో విద్యాపరమైన సమస్యలపై రాహుల్ చర్చించారు. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి పలు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ డీయూఎస్యూ అధ్యక్షుడి కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి విద్యార్థులు హాజరై తమ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల భాగస్వామ్యం, సమ్మిళిత విద్యాసంస్థల ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా చర్చించారు.
అధ్యాపక పదవుల్లో బడుగు వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పదవుల నియామకాలల్లో తమ వర్గాలపై చిన్నచూపు ఉందని విద్యార్థులు రాహుల్కు తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో కూడా అసమానతలు ఉన్నాయన్నారు. విద్యాపరంగా తమకు సరైన వసతులు కల్పించడం లేదని విద్యార్థులు వాపోయారు. గైర్హాజరు స్థితిగతులపై మార్కింగ్ చేపట్టకుండా అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
అనంతరం రాహుల్ మాట్లాడారు. విద్యార్థులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సందేశాన్ని తప్పకుండా ఆచరించాలని సూచించారు. విద్యార్థులు ‘చదవాలి, నిలదీయాలి, వ్యవస్థీకరించాలి’అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. న్యాయమైన, సమగ్ర విద్యాపర్యావరణ వ్యవస్థ సృష్టించడంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థుల పాత్ర తరగతి గదులకు బయటకు కూడా ఉండాలన్నారు. అణచివేతకు గురైన, ప్రాతినిధ్యం తక్కువైన చోట హక్కుల కోసం పోరాడాలని రాహుల్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రొణాక్ ఖాత్రీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.