PM Modi Mann Ki Baat on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం మన్కీ బాత్ 122వ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి మన్కీ బాత్లో ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపింది..
ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని మెచ్చుకున్నారు. దేశ ప్రజలను ఇది ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. అనేక కుటుంబాలు దీన్ని తమ జీవితాల్లో భాగం చేసుకున్నారని తెలిపారు. ఆపరేషన్ సమయంలో పుట్టిన చిన్నారులకు సిందూర్ అని నామకరణం చేశారని గుర్తుచేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్నారు. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాదని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదని, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని మోదీ అన్నారు.
పట్టణాల్లో తిరంగ యాత్రలు..
అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో తిరంగ యాత్రలు నిర్వహించారని కొనియాడారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని పేర్కొన్నారు. మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందన్నారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మన్కీ బాత్లో ప్రస్తావించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రశంసించారు.