Site icon Prime9

Shashi Tharoor on BJP: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

Shashi Tharoor

Shashi Tharoor

Congress MP Shashi Tharoor on BJP: తాను ప్రభుత్వం కోసం పనిచేయడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ కుండ బద్దలు కొట్టారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో ఒక కాలమ్ రాశానని పేర్కొన్నారు. గట్టిగా కొట్టడమే కాకుండా తెలివిగా కొట్టాల్సిన సమయం అసన్నమైందని ఆ కాలమ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ అదే పనిచేసిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు చెప్పారు.

 

అమెరికాలో పర్యటనలో భాగంగా శనివారం భారత కాన్సులేట్ కార్యాలయంలో ఎంపీ శశిథరూర్ మాట్లాడారు. ఉగ్రదాడి ద్వారా దేశాన్ని విభజించాలని భావించిన పాక్‌కు భారతీయుల ఐక్యత ఎలా ఉంటుందో తెలిసేలా చేసిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దేశంలోని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. భారతీయుల్లో అసాధారణ ఐక్యత ఉందని ఘటన ద్వారా తేటతెల్లమైందని గుర్తు చేశారు.

 

ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టిందని గుర్తు చేశారు. దీని ద్వారా పాక్‌తోపాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. జాబితాలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలు ఉన్నాయని వివరించారు. ఉగ్రవాదంపై ఇండియా తన స్పష్టమైన వైఖరిని ఉగ్రదాడి అనంతరం మరోసారి బహిర్గతమైందని వివరించారు.

 

అమెరికా బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను మోదీ సర్కారు ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల శశిథరూర్ మోదీ కేబినెట్‌లోని మంత్రితో సెల్ఫీ దిగారు. ప్రధాని కేరళ పర్యటనలో భాగంగా శశిథరూర్‌తో వేదికను పంచుకున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ గుర్రుగా ఉన్నది. శశిథరూర్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

 

Exit mobile version
Skip to toolbar