Prime9

Mamata Banerjee : వెంటనే ఎన్నికలు పెట్టండి.. ప్రధాని మోదీకి మమతా సవాల్

West Bengal CM Mamata Banerjee : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, హింస పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని తృణమూల్ ప్రభుత్వం నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అలిపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను ఊహించలేదన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ఉన్నామని, టెర్రరిజాన్ని సహించబోమని చెప్పేందుకు ఎంపీలు పర్యటిస్తున్నారని, ఈ సమయంలో ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీకి మమతా సవాల్ విసిరారు.

 

గెలుపు మాదే..
పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు పెట్టాలని మమతా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. బెంగాల్ ప్రజలంతా తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు. తృణమూల్‌కు డోకా లేదన్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించినా తమదే విజయమని మమతా ధీమా వ్యక్తం చేశారు. అలిపుర్‌దువార్‌లో జరిగిన సభలో దీదీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముర్షిదాబాద్, మాల్దా అల్లర్లు దీనికి ఉదాహరణ అని అన్నారు.

 

గూండాలకు స్వేచ్ఛ ఇచ్చి ప్రజలపై ఉసిగొల్పారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇలాగేనా సర్కారును నడిపేదని దుయ్యబట్టారు. ప్రతి అంశంలో కోర్టులు కలుగజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తృణమూల్ సర్కారును ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈ ప్రభుత్వం తనకు వద్దని అంటున్నారని మోదీ పేర్కొన్నారు. వ్యాఖ్యలపై మమతా పైవిధంగా స్పందించారు. వెంటనే ఎన్నికలు పెట్టాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.

Exit mobile version
Skip to toolbar