Site icon Prime9

Operation Sindoor : పీవోకే పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గం : విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్

Randhir Jaiswal

Randhir Jaiswal

External Affairs Ministry Spokesperson Randhir Jaiswal : ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన పాక్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇండియాతో సహా ప్రపంచ దేశాల్లోని అమాయకులను ఉగ్రవాదులు బలి తీసుకున్నారని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు నిలిపివేసే వరకూ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

 

భారత్‌లో ఎలాంటి మార్పు లేదు..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని ఇండియా మరోసారి పునరుద్ఘాటించింది. జమ్మూకశ్మీర్‌ విషయంలో ఇండియా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని ఇండియా అంగీకరించదని స్పష్టం చేసింది. పీవోకేను పాకిస్థాన్ ఖాళీ చేసే అంశం మాత్రమే మిగిలి ఉందని తెలిపింది.

 

ఉగ్రవాదులను అణచివేయడమే భారత్‌ ప్రాథమిక లక్ష్యం..
కాల్పుల విరమణపై తమ వైఖరి మారదని రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నుంచి సంప్రదింపులు జరిపినా వారితో ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ఉగ్రవాదులను అణచివేయడమే ఇండియా ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. ఉగ్రస్థావరాలపై ఇండియా దాడి చేసిందని తెలిపారు. ప్రతిగా పాకిస్థాన్ దుస్సాహసానికి దిగిందని పేర్కొన్నారు. ప్రతిచర్యగానే ఇండియా దాడులు చేసిందన్నారు. పాక్ కాల్పులు నిలిపివేస్తే ఇండియా దాడులు ఆపేస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రపంచదేశాలకు చెప్పామని గుర్తుచేశారు. తాము చెప్పిన విషయాన్ని ప్రపంచ దేశాల నాయకులు పాక్‌కు చెప్పి ఉంటారని, ఇండియా చెప్పిన విషయాన్ని పాకిస్థాన్ పెడచెవిన పెట్టిందని రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar