Uttarakhand Landslides: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ టీమ్ జేసీబీల సాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ధరి దేవి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఖంక్ర రహదారిపై కొండ చరియలు విరిగిపడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ప్రయాణికలకు అండగా నిలుస్తున్నారు.
దీంతో రిషికేశ్, దేవ్ ప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, చమోలి, జోషిమఠ్, బద్రీనాథ్ కు రాకపోకలు ఆగిపోయాయి. రిషికేశ్ నుంచి ఆయా ప్రదేశాల గుండా బద్రీనాథ్ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ధరీ దేవి ఆలయం ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్- రుద్రప్రయాగ్ మార్గంలో ఉంది. కాగా మే 27 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది.