Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి పెద్ద ఊరట దక్కింది. ఆయనకు రెండు దేశాల పౌరసత్వం ఉందని, అందుకే భారత్ లో రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తీర్పు సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం అనేది దేశాల మధ్య జరగాల్సిన వ్యవహారమని, పౌరసత్వంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న చర్యలను పిటిషనర్ కు తెలపాలని ఆదేశించింది.
కాగా రాహుల్ గాంధీకి భారత్ తో పాటు బ్రిటన్ లో కూడా సిటిజన్ షిప్ ఉందని ఆరోపిస్తూ కర్నాటకకు చెందిన విఘ్నేష్ శిశిర్ అనే లాయర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84ఏ ప్రకారం ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయన అనర్హుడని చెప్పారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పౌరసత్వంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సూచించింది. కేంద్రం నిర్ణయం తర్వాత పిటిషనర్ మళ్లీ కోర్టును అశ్రయించే అవకాశాన్ని కల్పించింది.