Hariramazogaiah: టీడీపీ, జనసేన కలిస్తే పశ్చిమగోదావరి జిల్లా క్లీన్ స్వీప్ .. చేగొండి హరిరామజోగయ్య

టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తే పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. 15 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు టిడిపి జనసేన కూటమి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆయన విశ్లేషిస్తూ ఓ సంచలన లేఖని విడుదల చేశారు.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 07:27 PM IST

Hariramazogaiah: టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తే పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. 15 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు టిడిపి జనసేన కూటమి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆయన విశ్లేషిస్తూ ఓ సంచలన లేఖని విడుదల చేశారు. ఒక నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ నెగ్గే అవకాశం కనిపించడం లేదని జోగయ్య ఢంకా బజాయించి చెబుతున్నారు.

జనసేనకు 13 సీట్లు.. (Hariramazogaiah)

ఈ 15 సీట్లలో జనసేన 13 సీట్లు, రెండు సీట్లు టిడిపి గెలిచే అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. జనసేనని సపోర్టు చేసే కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండటం, జనసేనని బలపరిచే బిసి, ఎస్‌సి సామాజికవర్గంతోపాటు జనసేనకి బలమైన అభ్యర్థులు ఉండటం ఈ క్లీన్ స్వీప్‌కి కారణాలుగా జోగయ్య చెప్పారు. వైఎస్సార్‌సిపి ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉండటం కూడా జనసేన విజయాలకి కారణంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు.

ఓటర్ల సంఖ్యాబలంతోపాటు బలమైన అభ్యర్థులు ఉన్న నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, ఆచంట, ఏలూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఖాయమని జోగయ్య వివరించారు. అలాగే టిడిపికి దెందులూరు, పాలకొల్లు నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయని జోగయ్య తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల విషయానికి వస్తే జనసేనకి నర్సాపురం, రాజమండ్రి, టిడిపికి ఏలూరు నియోజకవర్గంలో అనుకూలంగా ఉందని జోగయ్య వెల్లడించారు.