TGIIC : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్శిటీ లోపల, బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది.
ప్రాజెక్టులో హెచ్సీయూ భూమి లేదు..
400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో హెచ్సీయూ భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఈ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని తెలిపింది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల కింద కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుందని పేర్కొంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని, సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని చెప్పింది.
విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న నేతలు..
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. 400ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని తెలిపింది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడింది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉందని, దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవని తేల్చి చెప్పింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉందని టీజీఐఐసీ పేర్కొంది.