Rain Alert : రాష్ట్రంలో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా, ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యాలు, మొక్కజొన్న, మిర్చి తడిసిపోయాయి.
శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మూడు రోజుల అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.