Bhatti Vikramarka : హెచ్సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై లాఠీఛార్జీ జరగడం బాధాకరమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడ ఉన్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ర్టంలో చంద్రబాబు నాయుడు బిల్లి రావుకు 400 ఎకరాలు కట్టబెట్టారన్నారని తెలిపారు. భారత్ ఐఎంజీ బోగస్ కంపెనీ అని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆ భూములను రద్దు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో భూములను తీసుకోకుండా ప్రైవేటు వారికి లాభం కలిగేలా ఉపేక్షించిందని ఆరోపించారు.
ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. తాము అధికారంలోకి రాగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాటం చేసి 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నామన్నారు. 400 ఎకరాల భూమిలో హైటెక్ సిటీ ప్రాజెక్టును విస్తరించి ఐటీ కంపెనీలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని తాము తీసుకోబోమన్నారు. పర్యావరణం, జీవజాలాన్ని కాపాడుతామన్నారు. అభివృద్ధి కోసం భూములను వినియోగిస్తామని చెప్పారు. గతంలో హెచ్సీయూ నుంచి తీసుకున్న భూములకు అప్పుడే వేరే భూమిని ఇచ్చామన్నారు భట్టి స్పష్టం చేశారు.