Site icon Prime9

CM Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్.. దేశంలోనే ఎత్తైన స్వర్ణతాపడం!

CM Revanth Reddy Unveils Yadagirigutta Temple Golden Vimana Gopuram: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బంగారు గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. స్వర్ణతాపడం కోసం రూ.80కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.80కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఈ స్వర్ణతాపడాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

కాగా, యాదగిరిగుట్టపై ఆవిష్కరించిన స్వర్ణగోపురం దేశంలోనే ఎత్తైన తొలి స్వర్ణతాపడ గోపురంగా చరిత్ర సృష్టించింది. ఈ గోపురంపై కనిపిస్తున్న నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు భక్తులకు కనివిందు చేయనున్నాయి. ఇదిలా ఉండగా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ విమాన గోపురం స్వర్ణమయంగా మారింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ముగిశాయి. నేడు (ఆదివారం) ఆలయ సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం ఘట్టం నిర్వహించి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు.

విమాన గోపురానికి బంగారు తాపడం..
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్‌‌ నిర్ణయించారు. అనేక మంది భక్తులు, దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. అయితే 2022 మార్చి 8న అప్పటి సీఎం కేసీఆర్‌‌ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. అనంతరం 2023లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌‌‌రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై దృష్టి సారించారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్​ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిసిన అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. మార్చి 1 నుంచి 11 వరకు జరిగే లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులను ఆలయ పూజారులు ఆహ్వానించారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా..
దేశంలో ఎక్కడ లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురం 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్‌‌ఎఫ్‌‌టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్‌‌ఎఫ్‌‌టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించగా.. రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేశారు. తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం, నగదుతో పాటు స్వామి వారి హుండీ ఆదాయం నుంచి డబ్బులను ఖర్చు చేశారు. దీంతో పనులు వేగం పుంజుకున్నాయి. పనులు జరిగే గోపురం వద్దకు ఎవరిని అనుమతించ లేదు. సీసీ కెమెరాల పటిష్ఠ బందోబస్తు మధ్య పనులు జరిగాయి. గతేడాది నవంబర్‌లో తాపడం పనులను ప్రారంభించి ఈ నెల 10న పూర్తిచేశారు.

బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి..
యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణతాపడం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లు తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్‌ తెలిపారు. స్వర్ణ తాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం పదకొండు వందల కిలోల రాగిని వినియోగించినట్లు చెప్పారు. రేపు జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడానికి ఆలయ సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు.

స్వర్ణ విమానం గోపురం విశేషాలు..

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉండగా.. బంగారు విమాన గోపురం వైశాల్యం 10,759 చదరపు అడుగులు ఉంది. దీని కోసం 68 కిలోల బంగారం ఉపయోగించారు. తాపడం పనులు డిసెంబరు 1, 2024న ప్రారంభమయ్యాయి. తాపడం కవచాల బిగింపు పనులు ఫిబ్రవరి 18, 2025న పూర్తయ్యాయి. బంగారు తాపడం బిగింపు ఖర్చు రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా) కాగా, రాగిరేకుల తయారీ ఖర్చు రూ.12 లక్షలు, 50 మంది కార్మికులు పనిచేశారు. ఈ పనులను నవయుగ మెటల్స్‌ సంస్థ చేయగా.. స్వర్ణ విమాన గోపురం పనులను ఎంఎస్‌ స్మార్ట్‌ క్రియేషన్స్, చెన్నై చేపట్టింది

Exit mobile version
Skip to toolbar