Site icon Prime9

Revanth Reddy : గోశాలల ఏర్పాటుకు కమిటీ.. ప్రణాళికలు సిద్ధం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy reviews with officials at the Command Control Center : తెలంగాణలో గోశాలల ఏర్పాటుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో శనివారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. తొలి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆలయాలకు సంబంధించిన భూముల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

 

స్థలాలను గుర్తించాలి..
అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇరుకు స్థలాల్లో కాకుండా మేత మేసేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోశాలల నిర్వహణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు.

 

డిజైన్లు పరిశీలించిన సీఎం..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. నాలుగైదు రోజుల్లో తుది మోడల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేయనుంది.

 

మరోవైపు వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు మృతిచెందటం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల కింద 8 కోడెలు మృత్యువాత పడగా, మరో 10 కోడెలు అనారోగ్యంతో బక్కచిక్కిపోయిన ఉన్నట్లు తెలుస్తోంది. రాజన్న భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు స్వామివారికి కోడెలను అందజేస్తుంటారు. గోశాలలో 2 వేల వరకు కోడెలు, ఆవులు ఉన్నాయి. కోడెల సంరక్షణకు 11 షెడ్లను ఏర్పాటు చేశారు. షెడ్లలో ఉండాల్సిన వాటికంటే ఎక్కువగా కోడెలు ఉన్నట్లు తెలుస్తోంది. కోడెల సంఖ్యలకు సంబంధించి అధికారులు సరైన సమాధానాలు చెప్పకపోవడం, ట్యాగ్‌లు లేకపోవడంతో అనేక కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి మొక్కుగా ఇస్తున్న కోడెలు అధికారుల నిర్లక్ష్యంతో మృత్యువాతపడటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar