CM Revanth Reddy Commnets in Review of Electricity Department: ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని, భవిష్యత్లో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారనుందని సీఎం తెలిపారు.
ఈ మేరకు విద్యుత్ టవర్లు, లైన్లు స్తంభాలు కనిపించకూడదని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా పూర్తిగా అండర్ గ్రౌండ్లోనే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక, ఓఆర్ఆర్ పరిధిలో సోలార్ విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక, ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే 9.8 శాతం డిమాండ్ పెరిగిందన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని సీఎం ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు చూడాలన్నారు.