KCR will Present Kaleshwaram Commission Inquiry on 5th June : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు అయ్యింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలు, ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తోంది.
ఇప్పటి వరకు 200 మందికి పైగా అధికారులు, నిపుణులను విచారించింది. 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 21న కేసీఆర్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న హాజరు కావాలని నోటీసులు అందాయి. విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా హాజరవుతారా లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది.
విచారణలో కేసీఆర్ సూచనల మేరకే బ్యారేజీల స్థల ఎంపిక, డిజైన్ మార్పులు జరిగాయని అధికారులు కమిషన్ ముందు వెల్లడించారు. ప్రాజెక్టు వైఫల్యం, రూ.1.2 లక్షల కోట్ల ఖర్చు జరిగిందని అధికారులు వివరించారు. ఇటీవల కమిషన్ గడువు జులై 31 వరకు పొడిగించింది. కేసీఆర్ హాజరైతే వివరణ తీసుకొని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఏకపక్ష నివేదికపై కేసీఆర్ కోర్టుకు వెళ్లవచ్చనే చర్చ జోరుగా జరుగుతోంది.