Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు భూములను తీసుకోవద్దని, అక్కడ ఉన్న చెట్లను తొలగించొద్దని యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలు ఘర్షణలకు దారి తీశాయి.
విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి..
నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. మరోవైపు విద్యార్థుల నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యూనివర్శిటీలో విద్యార్థుల నిరసనలకు సంబంధించి నకిలీ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి దిలీప్, క్రిశాంక్పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఎడిట్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అందిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు చర్యలు చేపట్టారు.
బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు..
దర్యాప్తు చేపట్టి బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. దిలీప్, క్రిశాంక్ హెచ్సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రజల్లో అశాంతిని కలించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా భూముల వివాదంపై ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో పోస్టులు పెట్టారని తెలిపారు. వీరిపై 353 1(బీ), 353 1(సీ), 353(2), 192, 196(1), 61 (1)(ఏ) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.