Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది.
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
మరోవైపు తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని సూచించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.