Site icon Prime9

SC Sub Classification : ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం : సీఎం చంద్రబాబు

SC Sub Classification

SC Sub Classification

SC Sub Classification : బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఏపీ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో సీఎం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారమవుతుందని గతంలో చెప్పినట్లు గుర్తుచేశారు. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందని, జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 

 

ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లో కమిటీ వేశామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రేషనలైజేషన్‌, కేటగిరీలపై 2000లో చట్టం చేశామన్నారు. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉషా మెహ్రా కమిషన్‌ నివేదిక ఇచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో తన ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగిందని చెప్పారు. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం తన అదృష్టమన్నారు.

 

 

సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు నందమూరి తారక రామారావు అన్నారు. పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనం నిషేధానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను తానే వేసినట్లు గుర్తుచేశారు. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేశామన్నారు. హోటళ్లు, మంచినీటి బావుల వద్ద వివక్ష పాటించకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు. సాంఘిక సమానత్వంపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించినట్లు గుర్తుచేశారు.

 

 

దళితుడిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన ఘగత టీడీపీదే..
లోక్‌సభ స్పీకర్‌గా దళితుడిని చేసిన ఘనత టీడీపీదేనని తెలిపారు. స్పీకర్‌గా బాలయోగి ఎంతో బాగా రాణించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దళిత మహిళ ప్రతిభా భారతిని స్పీకర్‌ చేసిన ఘనత కూడా తెలుగు దేశం పార్టీదేనన్నారు. కాకి మాధవరావును రాష్ట్ర సీఎస్‌గా చేసింది టీడీపీ అన్నారు. తాను యునైటెడ్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు కేఆర్‌ నారాయణన్‌ను రాష్ట్రపతిని చేశామన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు కీలక పదవులు ఇచ్చిందన్నారు. గతంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశారని, ఇప్పుడు ఎస్టీ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా చేసిందన్నారు.

 

 

ఎస్సీ కోసం రూ.8,400 కోట్లతో ఆర్థిక చేయూత పథకాలు తీసుకువచ్చామన్నారు. గతంలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, తన రాజకీయ జీవితమంతా పేదలకు న్యాయం చేసేందుకే కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో తమకు సహకరించిన పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఈ మార్చిలోనే పీ4 విధానం
ఏపీలో మౌలిక వసతులు పెంచేందుకు గతంలో పీపీపీ విధానం తీసుకువచ్చామన్నారు. కొత్తగా ఈ నెలలో పీ4 విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. ఆర్థికంగా బాగున్న వారు సమాజానికి ఎంతో కొంత తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. పేదరికంలో ఉన్న 30లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు అన్నారు.

Exit mobile version
Skip to toolbar