Prime9

AP CM Chandrababu @Mahanadu: నా బలం, బలగం టీడీపీ.. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: చంద్రబాబు

AP CM Chandrababu Naidu @Mahanadu: దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషిచేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.

 

సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు..

తన ఎంపికకు సహకరించిన ప్రతిఒక్కరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలం, బలగం టీడీపీ అన్నారు. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయని చెప్పారు. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నామన్నారు. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు వేశామన్నారు.

 

రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాం..

రాయలసీమ రాళ్ల సీమ కాదని, రత్నాల సీమగా మారుస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీయే కారణమన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశామని, టీడీపీ అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని శపథం చేశారు. హంద్రీనీవా కింద చివరి పొలాలకు నీళ్ల కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత హంద్రీనీవాకు భారీగా ఖర్చు చేస్తున్నామన్నారు. వెలిగొండతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు.

 

Exit mobile version
Skip to toolbar