Site icon Prime9

Nara Lokesh : దశలవారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తాం : మంత్రి లోకేశ్‌

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తొలగించిందని, తిరిగి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు.

టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తాం..
జీవో 117 వల్ల 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని మంత్రి లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లపై గతంలో పెట్టిన కేసులను ఎత్తివేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీనిచ్చారు. ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గిస్తున్నామని, నోట్ బుక్‌లు, పుస్తకాలు, బెల్టులు, బ్యాగ్‌లు, చిక్కీలపై గత సీఎం జగన్ తన ఫొటో ముద్రించుకున్నారని, ఇకనుంచి ప్రభుత్వ ముద్రతోనే పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పార్టీ రంగు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరుతో విద్యా కిట్లు పంపిణీ చేస్తామన్నారు. పిల్లలకు యూనిఫాంలునాణ్యమైనవి ఇస్తున్నామన్నారు. భారం లేకుండా పుస్తకాల సంఖ్య తగ్గించినట్లు తెలిపారు. పుస్తకాలు, బ్యాగ్‌లపై ప్రభుత్వ లోగో ఉంటుంది కానీ, సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ఎక్కడా పెట్టలేదన్నారు.

ఉపాధ్యాయ బదిలీ యాక్టును అమలు చేస్తాం..
రాబోయే ఐదేండ్లలో చిక్కీల కింద రూ. 240 కోట్లు, కోడి గుడ్లపై రూ.144 కోట్లు ప్రభుత్వం ఆదా చేస్తుందని తెలిపారు. పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వ సొమ్ము ఆదా చేశామన్నారు. ప్రతి గ్రామానికి మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకటో తరగతి 1 ఉపాధ్యాయ విధానాన్ని అమలు చేయాలన్నది లక్ష్యమన్నారు. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్‌ మానిటరింగ్ చేస్తామన్నారు. పుస్తకాల్లో ప్రతి సబ్జెక్ట్‌కు క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నామన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అమరావతిలో ప్రపంచస్థాయిలో టీచర్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియారిటీ జాబితాను ప్రకటించామని, జాబితాపై అభ్యంతరాలు తీసుకున్న తర్వాత ఆన్‌లైన్‌ చేస్తామన్నారు. టీచర్ ట్రాన్స్‌ఫర్‌ యాక్టును అమలు చేస్తామని, డీఎస్సీ నోటిఫికేషన్‌ తప్పకుండా విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాదిలోపే ఉపాధ్యాయులను నియమించే బాధ్యత తీసుకుంటామన్నారు.

Exit mobile version
Skip to toolbar