AP: జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకం డబ్బులు అకౌంట్లలో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే సంక్షేమ కేలండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి మహానాడు, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. కడప వేదికగా మూడురోజులపాటు మహానాడు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాల కాన్సెప్ట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. ప్రజలతో కలిసి నాయకులు మరింతగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.