Prime9

Nadendla Manohar: జూన్‌ 1 నుంచి చౌకధర దుకాణాల్లో రేషన్‌: మంత్రి నాదెండ్ల

AP Civil Supplies Minister Nadendla Manohar: జూన్‌ 1వ తేదీ నుంచి చౌకధర దకాణాల్లోనే రేషన్‌ బియ్యం సరఫరా చేస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను పార్థసారధితో కలిసి నాదెండ్ల మీడియాకు వెల్లడించారు.

 

గత ప్రభుత్వం ఎండీయూల పేరిట నాశనం చేసింది..
29 వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యంతోపాటు ఇతర సరకుల సరఫరా జరిగేదని మంత్రి చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూల పేరిట వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. 9,260 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల కోసం రూ.1860 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక పోయారని పేర్కొన్నారు. 30 శాతం మందికి రేషన్‌ అందడం లేదని ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. రేషన్‌ సరఫరాకు వాహనాలు వచ్చిన తర్వాత జవాబుదారీ తనం లేదని, సరకులు ఎటు వెళ్తున్నాయో తెలియదన్నారు.

 

వందల సంఖ్యలో క్రిమినల్‌ కేసులు వాహనాల ఆపరేటర్లపై నమోదయ్యాయని చెప్పారు. బియ్యం అక్రమ రవాణా కోసం ఓ గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేసుకున్నారని, 29వేల దుకాణాలకు 9వేల వాహనాలు సరిపోతాయా? దొంగలెక్కలు చూపి బియ్యం దారి మళ్లించారని ఆరోపించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27వేలు చొప్పున పౌరసరఫరాలశాఖ చెల్లిస్తోందన్నారు. చాలా అంశాలు పరిశీలించి వీటిని రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జూన్‌ 1 నుంచి చౌక దుకాణాల ద్వారా రేషన్‌ సరఫరా అవుతుందని స్పష్టం చేశారు. , 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పారు. 9,260 వాహనాలు ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని నాదెండ్ల వివరించారు.

Exit mobile version
Skip to toolbar